సంగారెడ్డిలో విషాదం.. నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

  • భారీ నీటి గుంతలో పడి ముగ్గురు బాలురు మృతి
  • బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో జరిగిన సంఘటన
  • ఒకరిని కాపాడే క్రమంలో మిగిలిన ఇద్దరు మృతి
సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక హనుమాన్ నగర్ లోని భారీ నీటి గుంతలో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన హనుమంత్ వివర్చ్ కాంబ్లీ (12), సందీప్ (9), వంశీకృష్ణ (9) గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లిన బాలురు ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఈ కుటుంబాలు కొన్నేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ ముగ్గురు బహిర్భూమికి వెళ్లారు. ఈ గుంతలో సందీప్ పడిపోవడంతో అతన్ని కాపాడే క్రమంలో కాంబ్లీ, వంశీకృష్ణ కూడా పడిపోయినట్టు సమాచారం. ఈ సంఘటనను గమనించిన ఓ పశువుల కాపరి ఈ సమాచారాన్ని మృతుల కుటుంబసభ్యులకు తెలియజేశాడని సమాచారం. ముగ్గురు చిన్నారుల తండ్రులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తుండగా, వారి తల్లులు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నట్టు స్థానికులు చెప్పారు. 
Go Back to Shorts
Sangareddy District
hanuman nagar
children
death

More Telugu News